అన్నాడీఎంకే, డీఎంకేలతో పొత్తుపై క్లారిటీ ఇచ్చిన కమలహాసన్!

  • ద్రావిడ పార్టీలతో పొత్తు ఆలోచన లేదు
  • థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు సత్తా మాకు మాత్రమే ఉంది
  • జిల్లాల కార్యదర్శులతో సమావేశంలో కమల్
2021లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడులో, ఇప్పటికే మక్కల్ నీది మయ్యమ్ పేరిట పార్టీ పెట్టిన స్టార్ హీరో కమలహాసన్, ప్రధాన పార్టీలతో పొత్తు పెట్టుకునేది లేదని తేల్చి చెప్పారు. అన్నాడీఎంకేతో గానీ, డీఎంకేతో గానీ తన పార్టీ పొత్తు పెట్టుకోబోదని ఆయన అన్నారు. తాజాగా, చెన్నైలోని ఓ స్టార్ హోటల్ లో జిల్లాల పార్టీ నేతలు, నియోజకవర్గాల ఇన్ చార్జ్ లతో సమావేశమైన ఆయన, ఎంఎన్ఎం నేతృత్వంలోనే తృతీయ కూటమి ఏర్పడుతుందన్నారు.

ద్రావిడ పార్టీలతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచన తనకు లేదని అన్నారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు సత్తా తమకు మాత్రమే ఉందని మిగతా పార్టీలన్నీ అంగీకరిస్తున్నాయని అన్నారు. ఈ సమావేశానికి 112 నియోజకవర్గాల ఇన్ చార్జ్ లు హాజరయ్యారు. వీరితో విడివిడిగా సమావేశమైన కమల్, నిన్నంతా మంతనాలు సాగించారు. మొత్తం 18 జిల్లాల శాఖల కార్యదర్శులు హాజరయ్యారని, మిగతా జిల్లాలతో మరో విడత సమావేశం ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

Kamal Haasan
AIADMK
DMK
Tamilnadu

More Telugu News